దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆప్ మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ తదితరులపై ఆ కేసు నమోదయింది.
ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనాకాలంలో మనీష్ సిసోడియా విద్యాశాఖ మంత్రిగా, సత్యేందర్ జైన్ పీడబ్ల్యూడీ మంత్రిగా ఉండేవారు. ఆ సమయంలో ఢిల్లీలో 12,748 పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణం తలపెట్టారు. ఆ నిర్మాణంలో 2వేల కోట్ల అక్రమాలు జరిగాయి. ఆ పనుల కాంట్రాక్టులు దక్కిన 34 మందిలో అత్యధికులకు ఆమ్ ఆద్మీ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలింది. భారీ మొత్తంలో వ్యయాలు చేసినా నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తికానే లేదు. తరగతి గదులు 30 ఏళ్ళు ఉండేలా కడితే.. 75ఏళ్లకు సరిపడేంతగా ఖర్చు పెట్టారు. గడువు ప్రక్రియను పాటించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్లను నియమించుకోవడంతో వ్యయం దాదాపు ఐదు రెట్లు పెరిగిపోయింది. ఇటీవల సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికలో తరగతి గదుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని నిర్ధారణ అయింది. కొత్త టెండర్లు తీసుకోనందున ఆ ప్రాజెక్టు వ్యయం రూ.326 కోట్లు పెరిగిందని రిపోర్టులో తెలిపింది. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ విచారణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ యేడాది మార్చిలో ఆమోదం తెలిపారు. దాంతో వారిపై ఇప్పుడు కేసు నమోదు చేసారు.