హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లోని ‘శ్రీ విద్యారణ్య’ పాఠశాల ప్రాంగణంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కుటుంబంలోని తల్లి స్వయంగా వంట చేసి భోజనాన్ని తీసుకుని వచ్చి తమ పిల్లలకు బడిలోనే తినిపించే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేళ.. కుటుంబ ప్రబోధనకు పెద్ద పీట వేస్తూ ఆ కార్యక్రమం చేపట్టారు. సంఘ్ స్ఫూర్తితో కుటుంబ విలువలను ఈ తరం విద్యార్థులకు నేర్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. మొదటినుంచి భారతీయ విలువలను నేర్పించడంలో స్విస్ వ్యవస్థ ..ముందు వరుసలో నిలుస్తుంది. తల్లులంతా తెచ్చిన ఆహారాన్ని అందరూ పంచుకొని తినటం ద్వారా తామంతా వసుధైక కుటుంబం అని చాటి చెప్పారు. పిల్లలకు తాము తెచ్చిన ఆహారాన్ని కొసరి కొసరి తినిపించి వారితో తమ అనుబంధాన్ని మరింత బలపరుచుకున్నారు.
వాస్తవానికి ఆధునిక కాలంలో ఇంటిలో వంట చేసుకుని తినడం తగ్గిపోతోంది. బయటనుంచి జంక్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవడంతో ఆరోగ్యం, ఆనందం ఆవిరైపోతున్నాయి. పిల్లలు, పెద్దలు బైట తినడానికి అలవాటు పడడంతో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం తగ్గిపోతోంది. అటువంటి పోకడలకు దూరంగా మనదైన కుటుంబ వ్యవస్థను గుర్తు చేసేందుకు స్విస్ ఈ కార్యక్రమం చేపట్టింది . పిల్లలు సకుటుంబ సపరివార సమేతంగా రావడంతో స్విస్ ప్రాంగణం అంతా కళకళలాడింది.
భారతీయ విలువలకు పెద్దపీట వేసే విద్యా భారతి అనుబంధంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో స్విస్ సేవలు అందిస్తోంది. ఈ ‘తల్లి భోజనం’ కార్యక్రమంలో పాలుపంచుకున్న యాజమాన్యం, తల్లితండ్రులు, సిబ్బంది, హితైషులకు ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కరభట్ల కృష్ణమోహన్ కృతజ్ఞతలు తెలిపారు.